12, ఫిబ్రవరి 2011, శనివారం

నట రాజయకీయం

ప్రజారాజ్యం మరణించింది..!
ప్రజారాజ్యం అసువులు బాసింది..!
ప్రజారాజ్యం నికృష్ట చావుని చూసింది..!
ప్రజారాజ్యం దారుణ హత్య..!
ప్రజారాజ్యం నీచ ముగింపు..!


ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ప్రజారాజ్యానికి సరిగ్గా అతికినట్టు సరిపోతుందేమో..! నేను సైతం అంటూ ఉప్పెనలా వచ్చి.. అశ్రువొక్కటి ధారవోసాను అంటూ బీరాలు పలికి... ప్రజలను మోసం చేసిన కొంత మంది చిరాయువులు...చివరికి వెన్ను పోటు పొడిచి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు..! చివరికి...సదరు ప్రజారాజ్యాన్ని నమ్ముకుని సమిధలు అయింది ఎవరు... దాని కోసం పని చేసిన కార్యకర్తలు..! దాని స్థాపకుల అభిమానులు..! సత్య పాలన తాలూకు ప్రగల్భాలని నమ్మిన ప్రజలు..!


గత ఆరు దశాబ్దాలుగా లభించని, కనిపించని అభివృద్ధి ఇప్పటికైనా వస్తుంది అని ఎవరిని చూసి ఆశించారో... ఎవరిని నమ్ముకుని చర్చించుకున్నారో... ఎవరిని నిజమైన జగదేక వీరుడని అనుకున్నారో... ఎవరిని చూసి అన్యాయాన్ని, అవినీతిని అంతం చేసే త్రినేత్రుడని అనుకున్నారో..."ఊరికి ఇచ్చిన మాట" ని నిలబెట్టుకునే "మగమహారాజు" అని  ఎవరిని సమర్ధించారో.. ఆ "చిరంజీవి" ఒక "మహానగరంలో మాయగాడన్న" సంగతి...అతి భయంకర అవినీతి పరులతో చేయి కలిపి, పదవి కోసం పాకులాడుతూ...దాని కోసం ఎంతకైనా తెగించే "రాక్షసుడన్న"  సంగతి... ఇష్టంతో స్థాపించుకున్న రాజకీయ సంస్థని స్వార్ధంతో అన్యులకు ధారాదత్తం చేసే "లంకేశ్వరుడన్న" సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు..!


నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అని పలికి... ఇప్పుడు అదే ప్రపంచం తెల్లబోయేలా ప్రవర్తించింది ఎందుకు...? "చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ, ఇంకానా? ఇకపై చెల్లవు"... "సమన్యాయమే మన లక్ష్యం... సమ సమాజమే మన గమ్యం" అంటూ ఢంకా భజాయించారు....! కానీ జరిగిందేమిటి... తరచి చూడకుండానే తెలుస్తోందిగా... అవినీతి పాలిట "రుద్రనేత్రుడు" అని అనుకున్నవాడు "దేవాంతకు"డయ్యాడు..!

అభివృద్ధి ఆశలు చూపిస్తూ... వేంకటేశుడి పాదాల సాక్షిగా చేసిన "చాణక్య శపధాన్ని"  తుంగలో తొక్కి జనం నమ్మకాన్ని వమ్ము చేస్తూ... అభిమానులు, కార్యకర్తల ఉత్సాహాన్ని నీరు గారిచిన కిరాతకుడయ్యాడు... "రాక్షసుడయ్యాడు"..!

పురిటి నొప్పులు పడినంత సేపు పట్టలేదు... ఇది ఎంతో కాలం నిలబడేది కాదు అనే నిష్టుర సత్యాన్ని గ్రహించటానికి... ఎలాగో దీపాన్ని నిలబెట్టాములే అని అనుకుంటున్నంతలోనే అంతర్గత విబేధాలు... మనసుల మధ్య లుకలుకలు...! అవన్నీ సద్దుమణగకముందే ఎన్నికలు...మరి విజయం రమ్మంటే ఎలా వస్తుంది...ఐకమత్యం లేనివాళ్ళని ప్రజలెలా నమ్ముతారు...! అందుకే తగిన గుణపాఠం...పజ్జెనిమిదితో సరిపెట్టుకో అంటూ..! మరి అనుభవం పాఠం నేర్పిందా.... లేదు...! అప్పటికీ ఇంకా ఏవో శుష్క ప్రవచనాలు..! దాని ఫలితమే చివరికి ఆరిపోయిన ఈ దీపం..! అంటే... కేవలం రెండు సంవత్సరాల పసికందుని హత్య చేసిన మహా పాపం..!

నాయకత్వం చేతకాకపోవటం తప్పు కాదు...అలాంటప్పుడు ఎవరి సహాయాన్ని అర్ధించాలో కూడా తెలీని మానసిక దౌర్బల్యంతో ఉండటం కూడా తప్పు కాదు..! కానీ కొన్ని విషయాలని అడ్డం పెట్టుకుని ప్రజలని మోసం చేయాలనుకోవటం మాత్రం క్షమించరాని నేరం..! ఏ క్షణాన దురితులతో చేతులు కలిపాడో...స్వార్ధ రాజకీయుల పంచన నిలిచాడో... ఆ క్షణానే ధర్మ పాలననీ... అవినీతి నిర్మూలననీ కాంక్షించే వారి దృష్టిలో "నకిలీ మనిషి" అనే ముద్ర వేయించుకున్నాడు...!

నటించిన ప్రతి సారీ విజయమే సిద్ధిస్తుంది అని భ్రమించే వాళ్లకి ఇదొక గట్టి పాఠం..! జీవించాడే అనేట్టుగా నటిస్తే చప్పట్లు కొట్టే అభిమానులే... నటననే జీవితంగా మార్చాలనుకుంటే...ఏమార్చాలనుకుంటే...  ఏమౌతుందో తెలియ చెప్పారు..! అన్ని పాత్రలలోనూ నటించటం అంత సులభం కాదన్న విషయం ఇప్పటికైనా తెలుసుకుని మసలుకుంటే మంచిది..లేదంటే కనీసం నటించటానికి కూడా అవకాశం లేని జీవితాన్ని ప్రసాదించే శక్తి అదే అభిమానులకి ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది సదరు "రాజా వక్రమార్కుల" వారికి...!
నటన నటనే... జీవితం జీవితమే అన్నట్టుగా ప్రవర్తించి... అభివృద్ధి కాంక్షని చేతల్లో చూపించి... దాన్ని సాకారం చేసి చూపించిన అన్నగారికి... రాజ్య కాంక్షతో ప్రజలని మోసం చేసి పబ్బం గడుపుకోవాలనుకుని అన్నయ్య, తమ్ముడు అనే ముద్ర వేసుకుని తిరిగే "తోడు దొంగలకీ" పోలిక ఎలా ఉంటుంది...!



ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు...  అభివృద్ధి సాధన, అవినీతి అంతం అనే లక్ష్యాలని చేరుకోవటానికి సమాజంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయానంటూ ఒక నెపం సమాజం మీదికే..! అంత పెద్ద లక్ష్యం కోసం ఒక పని చేసే ముందు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కూడా ముందుగా ఊహించగలిగే శక్తి లేదా..? మరి అలాంటప్పుడు జనాన్ని మభ్యపెట్టేట్టుగా "అన్నయ్య" చెలామణీ ఎందుకో..! రాజకీయం అంటే "మంచు పల్లకీ" అనుకున్నాడేమో..!



"రొట్టె ముక్కా, అరటి తొక్కా, బల్ల చెక్కా... నీ వేపే చూస్తూ ఉంటాయ్, తమ లోతు కనుక్కోమంటాయ్" అంటూ తన కవితావేశం లో శ్రీ శ్రీ గారన్నట్టు...  "చిత్రసీమ, రక్త పానం, రాజకీయం... నీ వేపే చూస్తూ ఉంటాయి తమని అందుకోమంటాయ్" అని ఇప్పుడు ఈ ఘనులని చూసి మనం అనుకోవాలేమో...! శ్రీ శ్రీ గారి కవితల్లో "కాదేదీ కవితకనర్హం.." అని చెప్పినట్టుగానే...ఇప్పుడు మనం కూడా వీళ్ళని చూసి అర్ధం చేసుకోవాలేమో... "కాదేదీ ధనార్జనకనర్హం..." అనే విషయాన్ని..!


ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాలంటే ప్రతి వ్యక్తీ.."నేనంటే... విశాల జగత్తు, విరిసిన మహత్తు! నేనంటే...ముసుగేసిన అక్షరవనం, ముసురేసిన నీలిమేఘం" అనే శ్రీ శ్రీ గారి మాటల్లోని వాడిని వంటబట్టించుకుని ముందుకు పోవాలి..! లేదంటే...దొంగల ముఠా చేతుల్లో హతమవాల్సిందే..!